న్యూఢిల్లీ, ఏప్రియల్ 14: సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, ప్రముఖ బ్రాండ్ల పేరిట నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఒక భారీ వ్యవస్థీకృత ముఠా నెట్ వర్క్ ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. బహుళజాతి సంస్థల ట్రేడ్‌మార్క్‌లను యథేచ్ఛగా వాడుకుంటూ, అసలుకు నకలుకు తేడా తెలియకుండా ప్యాకేజింగ్ చేస్తూ మార్కెట్‌ను ముంచెత్తుతున్న ఈ రాకెట్‌ను అధికారులు పక్కా ప్లాన్‌తో దెబ్బకొట్టారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, సుమారు 20 వేలకు పైగా నకిలీ వస్తువులను, భారీ ఎత్తున ముడి సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీలోని సంజయ్ గాంధీ ట్రాన్స్‌పోర్ట్ నగర్ కేంద్రంగా ఒక రహస్య కర్మాగారం నడుస్తోందన్న పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ మొదలైంది. ప్రముఖ ఎఫ్.ఎం.సి.జి సంస్థ ‘రెకిట్ బెన్కిజర్’ ప్రతినిధులు తమ బ్రాండ్ అయిన ‘వీట్’ హెయిర్ రిమూవల్ క్రీమ్ పేరుతో మార్కెట్లో నకిలీ ఉత్పత్తులు చెలామణి అవుతున్నాయని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ రాజ్ కుమార్ పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఆ ప్రాంతంలో నిఘా పెంచి, నకిలీ తయారీ యూనిట్‌పై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో అక్కడ కనిపించిన దృశ్యాలు అధికారులనే విస్మయానికి గురిచేశాయి. అత్యాధునిక యంత్రాలు, భారీ ప్యాకేజింగ్ యూనిట్లు, అసలైన ఉత్పత్తులను తలపించే రంగులు, లోగోలతో నిండిన వేల సంఖ్యలో ఖాళీ ట్యూబ్‌లు అక్కడ లభ్యమయ్యాయి.

నిందితుల ప్రొఫైల్: కింగ్‌పిన్ నుంచి కింది స్థాయి వరకు..

ఈ అక్రమ సామ్రాజ్యానికి సూత్రధారి నీరజ్ గుప్తా అని పోలీసులు గుర్తించారు. గత రెండేళ్లుగా ఈ దందాను నడిపిస్తున్న నీరజ్ గుప్తా, తొలుత చిన్నపాటి వ్యాపారాలు చేసినప్పటికీ, భారీ లాభాల కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇతనికి సహాయకులుగా రవి, సురేష్ కుమార్ రాజ్‌పుత్, దినేష్ చంద్ర సతి వ్యవహరించేవారు. రవి అనే నిందితుడు ప్యాకేజింగ్ మెటీరియల్ మరియు గ్రాఫిక్స్‌ను సమకూర్చడంలో సిద్ధహస్తుడు. ఇక సురేష్ కుమార్ రాజ్‌పుత్ తన సొంత ఫ్యాక్టరీలో అక్రమంగా ప్రింటింగ్ ప్లేట్లను ఉపయోగించి, ప్రముఖ కంపెనీల కార్టన్ బాక్సులను ముద్రించేవాడు. దినేష్ చంద్ర సతి ఈ ప్రింటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ, నకిలీ ప్యాకేజింగ్ మెటీరియల్‌ను సరఫరా చేసే బాధ్యతలు చూసేవాడు.

వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం!

ఈ ముఠా కేవలం కంపెనీల ఆదాయానికే గండి కొట్టడం లేదు, వినియోగదారుల ఆరోగ్యంతోనూ ప్రమాదకరమైన ఆటలాడుతోంది. స్వాధీనం చేసుకున్న ముడి సరుకుల్లో పొటాషియం థియోగ్లైకోలేట్, హైడ్రేటెడ్ లైమ్ వంటి రసాయనాలతో పాటు అత్యంత నాసిరకమైన పదార్థాలు ఉన్నాయి. చర్మ సౌందర్యం కోసం వాడే క్రీములలో ఇటువంటి ప్రమాదకర రసాయనాలను వాడటం వల్ల ప్రజలకు తీవ్రమైన చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం తక్కువ ధరకే వస్తున్నాయని వీక్లీ బజార్లలోను, స్థానిక చిన్న దుకాణాల్లోనూ ఈ నకిలీ ఉత్పత్తులను కొనుగోలు చేసే సామాన్యులు ఈ విషవలయంలో చిక్కుకుపోతున్నారు.

పోలీసుల పంజా.. భారీ రికవరీ!

ఈ ఆపరేషన్‌లో భాగంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాదాపు 4000 నింపిన నకిలీ వీట్ ట్యూబ్‌లు, 5500 కి పైగా ప్యాక్ చేసిన రిటైల్ యూనిట్లు, మరియు సుమారు 10,000 ఖాళీ ట్యూబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వేల సంఖ్యలో ప్లాస్టిక్ స్పాట్యులాలు, ముద్రించిన కార్టన్లు మరియు భారీ ఎత్తున రసాయనాలను సీజ్ చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత – బి యెన్ ఎస్ లోని వివిధ సెక్షన్లతో పాటు కాపీరైట్ చట్టం 1957 కింద కేసులు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ గొలుసుకట్టు దందాలో మరికొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, హోల్ సేలర్ల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీసుల "జీరో టాలరెన్స్" విధానంలో భాగంగా ఇలాంటి వ్యవస్థీకృత నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హర్ష్ ఇండోరా స్పష్టం చేశారు. ప్రజలు కూడా వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఉత్పత్తుల సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.