ఢిల్లీ, ఏప్రియల్ 18 : ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ జాబ్.. గూగుల్ రేటింగ్స్ ఇస్తే చాలు.. లక్షల్లో లాభాలు.. అంటూ అమాయకులను నమ్మించి, వారి ఖాతాల నుంచి లక్షల రూపాయలు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను ఢిల్లీ నార్త్ డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. 'ఆపరేషన్ సై-హాక్ 4.0' పేరుతో చేపట్టిన ఈ సుదీర్ఘ వేటలో భాగంగా, సుమారు 800 కిలోమీటర్ల మేర ప్రయాణించి, నిందితులను లూథియానా మరియు ఢిల్లీ ప్రాంతాల్లో అరెస్టు చేశారు.

బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, టెలిగ్రామ్ వేదికగా మొదలైన ఈ మోసం అత్యంత పక్కా ప్రణాళికతో సాగింది. గూగుల్ హోటల్ రేటింగ్స్, రివ్యూలు ఇచ్చే పార్ట్‌టైమ్ ఉద్యోగమని నమ్మించి, మొదట చిన్న చిన్న టాస్కులు ఇచ్చి స్వల్ప లాభాలు (రూ. 125) చూపారు. ఆ నమ్మకంతో బాధితుడు 'ప్రీపెయిడ్ టాస్క్' అనే ఉచ్చులో పడ్డాడు. రూ. 1,000 పెట్టుబడికి రూ. 1,300 తిరిగి రావడంతో, నిజమేనని భ్రమపడి వరుసగా రూ. 3,000, రూ. 20,000, రూ. 30,000 చొప్పున పెట్టుబడి పెట్టాడు.

చివరికి అసలు ఆట మొదలైంది. విత్‌డ్రా చేసుకునే సమయానికి 'తప్పు చేశారని', 'ఖాతా ఫ్రీజ్ అయ్యిందని' భయపెట్టి, దానిని అన్‌ఫ్రీజ్ చేయడానికి రూ. 50,000, ఆ తర్వాత రూ. 1,00,000 ఇలా పలు దఫాలుగా మొత్తం రూ. 1,46,000 కాజేశారు. బాధితుడు చివరకు తాను మోసపోయానని గ్రహించి ఎన్.సి.ఆర్.పి పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు.

ఆపరేషన్ 'సై-హాక్'.. సాంకేతికతతో వేట

ఈ కేసును సవాలుగా తీసుకున్న నార్త్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీసులు, ఏసీపీ విదుషీ కౌశిక్ పర్యవేక్షణలో, ఎస్.హెచ్.ఓ రోహిత్ గహ్లోత్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వాట్సాప్, గూగుల్, ఐపి లాగ్స్, సుమారు 200 మొబైల్ నంబర్ల కాల్ డేటా రికార్డులను విశ్లేషించారు. నిందితులు వాడిన బ్యాంక్ ఖాతాలన్నీ నకిలీ చిరునామాలతో సృష్టించినవని తేలడంతో దర్యాప్తు క్లిష్టంగా మారింది. అయినా నిరుత్సాహపడకుండా, సాంకేతిక నిఘాతో లూథియానాలోని తిబ్బా రోడ్డులో ఉంటున్న పునీత్ శర్మను ఏప్రిల్ 2న అరెస్టు చేశారు. పునీత్ ఇచ్చిన సమాచారంతో కో-అక్యూజ్డ్ మనీష్ కోసం గాలించగా, అతను ఢిల్లీలోని కింగ్స్‌వే క్యాంప్‌లో తలదాచుకున్నాడని గుర్తించి, ఏప్రిల్ 4న అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నేపథ్యం.. బ్యాంక్ ఖాతాల వ్యాపారం

అరెస్టు చేసిన మనీష్ (29) పేటీఎం ఏజెంట్‌గా పనిచేస్తూ, క్యూఆర్ స్కానర్ల ఇన్‌స్టాలేషన్ పేరుతో దుకాణాల యజమానులతో పరిచయాలు పెంచుకున్నాడు. బ్యాంకింగ్ లావాదేవీలపై మంచి పట్టు ఉండటంతో ఇతడే ఈ ముఠాకు కీలకంగా మారాడు. నిరుపేదలు, తక్కువ ఆదాయం ఉన్న వారి నుంచి తలా రూ. 5,000 ఇచ్చి బ్యాంక్ ఖాతాలు కొనుగోలు చేసి, వాటిని అసలైన సైబర్ నేరగాళ్లకు ఒక్కో ఖాతాను రూ. 15,000కు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. 43 ఏళ్ల పునీత్ శర్మ క్లాత్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్‌గా పనిచేస్తూ, డబ్బు ఆశతో తన ఖాతాలను మనీష్‌కి విక్రయించాడని పోలీసులు తెలిపారు.

కేవలం ఈ ఒక్క కేసులోనే కాకుండా, ఎన్.సి.ఆర్.పి పోర్టల్‌లో వీరిపై మరిన్ని ఫిర్యాదులు ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక పాస్‌బుక్ స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో వచ్చే మాయమాటలకు లొంగిపోవద్దని, అధిక లాభాల ఆశ చూపే యాప్‌లు, టెలిగ్రామ్ గ్రూపుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని నార్త్ డిస్ట్రిక్ట్ డీసీపీ రాజా బాంతియా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.