మీ వాహనం ఇంజిన్ ఆకస్మాత్తుగా ఆగిపోతుందా? వింత శబ్దాలు వస్తున్నాయా? ఢిల్లీ ఘాజీపూర్ ప్రాంతంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఛేదించిన నకిలీ ఇంజిన్ ఆయిల్ ముఠా ఉదంతం వాహనదారులను ఆందోళనకు గురి చేస్తోంది. కాస్ట్రోల్, హీరో, బజాజ్ వంటి ప్రముఖ బ్రాండ్ల పేర్లతో చలామణి అవుతున్న ఈ 'నకిలీ విషం' వాహనాల ఇంజిన్లను ఎలా నాశనం చేస్తోందో తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం చదవండి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీ వాహన ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోయిందా? రైడింగ్ లో షడన్గా ఇంజిన్ నుండి వింత శబ్దాలు వస్తున్నాయా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు ఏ ఇంజన్ ఆయిల్ లో వాహనంలో వాడారో చెక్ చేసుకోండి. ఇంజిన్ ఆయిల్ డబ్బాపై ఉన్న బ్రాండ్ పేరు చూసి మోసపోకండి. అది మీకు తెలియకుండానే మీ వాహనానికి ప్రాణాంతకమైన "నకిలీ విషాన్ని" ఎక్కిస్తుండవచ్చు. ఘాజీపూర్ ప్రాంతంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ బయటపెట్టిన తాజా నకిలీ ఇంజిన్ ఆయిల్ ముఠా ఉదంతం ఇప్పుడు వాహనదారుల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రముఖ బ్రాండ్లైన కాస్ట్రోల్, యమహా, హీరో, బజాజ్ వంటి పేర్లతో విచ్చలవిడిగా మార్కెట్లోకి వస్తున్న ఈ నకిలీ నూనెలు కేవలం రంగు నీళ్లు మాత్రమే కాదు, మీ వాహనానికి అవి విషతుల్యం. ఇంజిన్ ఆయిల్ ముఖ్య ఉద్దేశ్యం వాహనంలోని విడిభాగాల మధ్య రాపిడిని తగ్గించి, వేడిని పీల్చుకోవడం. కానీ, ఈ ముఠా తయారు చేస్తున్న నకిలీ ఆయిల్లో కనీస నాణ్యత ప్రమాణాలు లేకపోవడం వల్ల అది వేడిని తట్టుకోలేక, ఇంజిన్ భాగాలను కరిగించేస్తుంది.
ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ఇంజిన్ ఆయిల్
ప్రముఖ బ్రాండ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తూ, నాణ్యత లేని నకిలీ ఇంజిన్ ఆయిల్ను మార్కెట్లోకి వదులుతున్న ముఠాను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. ఘాజీపూర్ ప్రాంతంలో ఈ ముఠా నిర్వహిస్తున్న అక్రమ తయారీ కేంద్రాన్ని ఛేదించిన పోలీసులు, భారీ మొత్తంలో నకిలీ ఇంజిన్ ఆయిల్తో పాటు ప్యాకేజింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు క్రైమ్-IV డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంకజ్ కుమార్ వెల్లడించారు.
ఢిల్లీలో బ్రాండెడ్ ఉత్పత్తుల పేరుతో జరుగుతున్న నకిలీ తయారీ కేంద్రాలపై క్రైమ్ బ్రాంచ్ (ER-II) ప్రత్యేక నిఘా ఉంచింది. ఈ క్రమంలో, ఈ నెల 16న ఎస్ఐ విషన్ కుమార్ నేతృత్వంలోని బృందానికి ఘాజీపూర్ పరిధిలో నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారీపై ఖచ్చితమైన సమాచారం అందింది. దీనిపై వెంటనే స్పందించిన ఎస్ఐ విషన్ కుమార్, ఎస్ఐ రాహుల్, ఎస్ఐ మనోజ్ మరియు ఇతర సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం, ఏసీపీ నరేందర్ సింగ్ పర్యవేక్షణలో ఘాజీపూర్ లోని గధోలి గ్రామంలో ఉన్న సదరు గోడౌన్పై మెరుపు దాడి చేశారు.
దాడుల్లో బయటపడిన అక్రమాలు
పోలీసుల దాడుల్లో నిందితులు నిర్వహిస్తున్న అక్రమ వ్యాపారం బయటపడింది. అక్కడ 'కాస్ట్రోల్', 'యమహా', 'హీరో' మరియు 'బజాజ్' వంటి ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు.
సుమారు 700 లీటర్ల నకిలీ ఇంజిన్ ఆయిల్ (28 డబ్బాలు - ఒక్కోటి 20 లీటర్ల సామర్థ్యం, 140 బాటిళ్లు - ఒక్కోటి లీటరు సామర్థ్యం).
550కి పైగా ఖాళీ బాటిళ్లు, డ్రమ్ములు, బకెట్లు, ఫన్నెళ్లు మరియు ఫిల్టర్ మెష్లు .
బాటిల్ సీలింగ్ మెషీన్, బార్కోడ్ సీలింగ్ కూపన్లు, వివిధ బ్రాండ్లకు చెందిన స్టిక్కర్లు.
నిందితుల నేపథ్యం
ఈ కేసులో అరెస్టు అయిన ఇద్దరు నిందితుల నేపథ్యం భిన్నంగా ఉంది.
రాకేష్ కుమార్ ఛబ్రా (52):ఈయన కురుక్షేత్ర నివాసి. గతంలో అక్కడ గార్మెంట్స్ షాప్ నడిపారు, కానీ కోవిడ్ సమయంలో అది మూతపడింది. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి దుస్తులు అమ్మే ప్రయత్నం చేసినా కలిసిరాలేదు. 2022లో ఇతరుల పరిచయంతో ఈ అక్రమ వ్యాపారంలోకి అడుగుపెట్టారు .
కుల్దీప్ సింగ్ (52):గీతా కాలనీకి చెందిన ఈయన, గతంలో ట్రక్కు డ్రైవర్గా పనిచేశారు. వెన్నునొప్పి సమస్యలతో ఆ వృత్తిని వదిలేసిన తర్వాత, సుమారు ఏడాదిన్నర క్రితం రాకేష్తో పరిచయం ఏర్పడి, ఈ నకిలీ తయారీ దందాలో చేరారు .
తదుపరి చర్యలు
నిందితులపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో బీఎన్ఎస్ (BNS) సెక్షన్లు 318(4), 336(3), 336(4), 319, 61(2), 3(5) మరియు కాపీరైట్ చట్టం సెక్షన్లు 63/65 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ముఠా ఎక్కడెక్కడ సరుకును సరఫరా చేస్తోంది, ఈ అక్రమ సరఫరా గొలుసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి నకిలీ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నకిలీ ఇంజిన్ ఆయిల్ మీ బైక్ను ఎలా చిదిమేస్తుందంటే!
పిస్టన్ జామ్: నాణ్యత లేని నూనె వాడటం వల్ల ఇంజిన్లోని పిస్టన్లు అతి త్వరగా అరిగిపోయి, ఒక్కసారిగా ఇంజిన్ జామ్ అయ్యే ప్రమాదం ఉంది.
శాశ్వత వైకల్యం: ఒకసారి ఇంజిన్ లోపలి భాగం దెబ్బతింటే, అది మళ్ళీ రిపేర్ చేయడానికి వేల రూపాయల ఖర్చు అవ్వడమే కాదు, వాహనం మునుపటి సామర్థ్యాన్ని తిరిగి పొందలేదు.
ప్రమాదకరమైన ప్రయాణం: హైవేలపై వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఇంజిన్ మొరాయిస్తే, అది పెను ప్రమాదాలకు దారితీస్తుంది.
మార్కెట్లో దొరుకుతున్నది "మరణశాసనం"
పోలీసులు దాడి చేసిన ఈ అక్రమ తయారీ కేంద్రంలో సుమారు 700 లీటర్ల నకిలీ ఆయిల్తో పాటు, బార్కోడ్ సీలింగ్ కూపన్లు, బాటిల్ సీలింగ్ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవి చూస్తుంటే, సాధారణ వాహనదారులకు ఇది నకిలీ అని గుర్తించడం అసాధ్యం. నిందితులు రాకేష్ కుమార్ ఛబ్రా మరియు కుల్దీప్ సింగ్ తమ దందాలో భాగంగా, ఖాళీ బాటిళ్లను సేకరించి వాటిలో నాసిరకం నూనె నింపి, అసలైన కంపెనీలకు చెందిన స్టిక్కర్లు అంటించి ప్యాక్ చేస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
వాహనదారులు ఏం చేయాలి?
మీరు కష్టపడి కొనుక్కున్న వాహనం మీ కళ్ల ముందే తుక్కుగా మారుతుంటే చూడలేరు కదా? కాబట్టి, నకిలీ ఆయిల్ ముఠా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించండి:
అధికృత డీలర్లు మాత్రమే: రోడ్డు పక్కన కనిపించే చిన్న చిన్న షాపుల్లో తక్కువ ధరకు వస్తుందని ఆశపడి ఎప్పుడూ ఇంజిన్ ఆయిల్ కొనకండి. ఎప్పుడూ కంపెనీ అధీకృత డీలర్ల వద్దే ఆయిల్ మార్పించుకోండి.
సీల్ పరిశీలించండి: బాటిల్ కొనేటప్పుడు దాని ప్యాకింగ్, మూత మరియు బార్కోడ్ స్టిక్కర్లను నిశితంగా గమనించండి. ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే నిరాకరించండి.
బిల్లు తప్పనిసరి: ఏదైనా స్పేర్ పార్ట్స్ షాపులో ఆయిల్ మార్పించుకున్నప్పుడు, పక్కా బిల్లు తీసుకోవడం అలవాటు చేసుకోండి.
ఢిల్లీ పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నా, ఇలాంటి ముఠాలు ఇంకా మరెన్నో మూలల్లో ఉండే అవకాశం ఉంది. మీ వాహన జీవిత కాలం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. మీరు కొనే ప్రతి లీటర్ ఆయిల్ మీ ఇంజిన్ను బ్రతికిస్తుందా లేక బలితీస్తుందా అనేది ఒకసారి ఆలోచించండి.