"భారత డ్రగ్స్ నెట్వర్క్లో మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు మొహమ్మద్ సలీం డోలాను ఎన్సీబీ విజయవంతంగా భారత్కు రప్పించింది. టర్కీ అధికారుల సహకారంతో 'ఆపరేషన్ గ్లోబల్ హంట్' చేపట్టి ఇంటర్పోల్ రెడ్ నోటీసు నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో డ్రగ్స్ మాఫియాపై జరుగుతున్న పోరాటంలో ఇదొక కీలక మలుపు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి."
న్యూ ఢిల్లీ, ఏప్రియల్ 28: డ్రగ్స్ మాఫియాపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న పోరాటంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహ్మద్ సలీం డోలాను టర్కీ నుంచి భారత్కు రప్పించడంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఘనవిజయం సాధించింది. దేశంలో యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల నెట్వర్క్ను కూకటివేళ్లతో సహా తుడిచిపెట్టాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణకు ఈ పరిణామం ఒక నిదర్శనంగా నిలుస్తోంది.
టర్కీలో ఆపరేషన్ గ్లోబల్ హంట్: సలీం డోలా అరెస్ట్ వెనుక అసలు కథ
మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో ఆరితేరిన మహ్మద్ సలీం డోలాను పట్టుకునేందుకు ఎన్సీబీ 'ఆపరేషన్ గ్లోబల్ హంట్' పేరుతో వ్యూహాత్మక ఆపరేషన్ చేపట్టింది. భారత నిఘా సంస్థలు, అంతర్జాతీయ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ టర్కీ అధికారుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే ఎన్సీబీ అధికారులు సలీం డోలాను అధికారికంగా కస్టడీలోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఇతడిపై 2024 మార్చిలో ఇంటర్పోల్ రెడ్ నోటీసు కూడా జారీ అయింది.
డ్రగ్స్ సామ్రాజ్యానికి కింగ్ పిన్: రెండు దశాబ్దాల చీకటి చరిత్ర
ముంబైకి చెందిన 59 ఏళ్ల సలీం డోలా సామాన్యుడు కాదు. గత రెండు దశాబ్దాలుగా భారత్తో పాటు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో ఇతడు భారీ డ్రగ్స్ సిండికేట్ను నడుపుతున్నాడు. కేవలం సరఫరాదారుగానే కాకుండా, దేశీయంగా ఉన్న డ్రగ్స్ పంపిణీ నెట్వర్క్లకు బల్క్ సప్లయర్గా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పట్టుబడిన భారీ హెరాయిన్, చరాస్, మెఫెడ్రోన్ (MD), మాండ్రాక్స్ మరియు మెథాంఫెటామైన్ వంటి ప్రమాదకర డ్రగ్స్ కేసుల్లో ఇతడే ప్రధాన నిందితుడు. గుజరాత్ ఏటీఎస్ మరియు ముంబై పోలీసులకు కూడా ఇతడు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.
నార్కో సిండికేట్పై జీరో టాలెన్స్: అమిత్ షా హెచ్చరిక
సలీం డోలాను భారత్కు రప్పించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. నార్కో సిండికేట్ల పట్ల మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న 'జీరో టాలెన్స్' విధానానికి ఇది దక్కిన అతిపెద్ద విజయమని ఆయన అభివర్ణించారు. "డ్రగ్స్ ముఠాలను నిర్దాక్షిణ్యంగా అణచివేయాలన్న లక్ష్యంతో మా యాంటీ నార్కోటిక్ ఏజెన్సీలు ప్రపంచవ్యాప్తంగా తమ పంజా విసిరాయి. డ్రగ్ కింగ్పిన్లు ఎక్కడ దాక్కున్నా సరే, వారికి ఇక రక్షణ ఉండదు" అని అమిత్ షా స్పష్టం చేశారు. నేరస్తులు దేశ సరిహద్దులు దాటినా వదిలిపెట్టబోమని ఈ చర్యతో కేంద్రం గట్టి సందేశాన్ని పంపింది.
కుటుంబమే ముఠాగా.. అంతర్జాతీయ సహకారంతో చుట్టుముట్టిన నిఘా
సలీం డోలా డ్రగ్స్ నెట్వర్క్ను విచ్ఛిన్నం చేసే ప్రక్రియ గత ఏడాది నుంచే వేగవంతమైంది. 2025లో ఇతడి కుమారుడు తాహిల్ సలీం డోలాను, అలాగే మరికొందరు సహచరులను యూఏఈ నుంచి రప్పించి ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రధాన నిందితుడు సలీం కూడా చిక్కడంతో ఈ భారీ ముఠా ఆట కట్టినట్లయింది. టర్కీ అధికారులు, ఇంటర్పోల్ మరియు భారతీయ ఏజెన్సీల మధ్య కుదిరిన అసాధారణ సమన్వయం వల్లే ఈ ఆపరేషన్ విజయవంతమైంది. భారత్ గడ్డపై విషం చిమ్ముతున్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టే వరకు ఈ వేట కొనసాగుతుందని ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి.