ఢిల్లీలో ప్రారంభమైన ‘చింతన్ శివిర్ 2026’. ఆయుష్ చికిత్సలకు బీమా సౌకర్యం, కొత్త వాట్సాప్ ఛానల్, టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభం. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా సాగుతున్న ఈ సదస్సు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
న్యూఢిల్లీ, ఏప్రియల్ 16: భారతీయ సంప్రదాయ వైద్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడమే కాకుండా, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనలో ఆయుష్ రంగాన్ని ఒక కీలక భాగస్వామిగా మలిచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే వ్యూహాత్మక మేధోమథన సదస్సు ‘చింతన్ శివిర్ 2026’ గురువారం ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర ఆయుష్ మరియు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ప్రతాపరావ్ జాదవ్ ఈ సదస్సును ప్రారంభించి, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రతాపరావ్ జాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ చింతన్ శివిర్ ఒక నిలువుటద్దమని పేర్కొన్నారు. గత సదస్సులో సాధించిన పురోగతిని సమీక్షించుకుంటూనే, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఒక ఆచరణాత్మక రోడ్ మ్యాప్ను సిద్ధం చేయడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఆధునిక జీవనశైలి రుగ్మతలను నయం చేయడంలో ఆయుష్ వైద్య విధానం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని, ‘హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా’ అనే నినాదం ద్వారా ప్రపంచానికి భారత్ దిక్సూచిగా మారనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం చర్చలకే పరిమితం కాకుండా, ప్రతి నిర్ణయం క్షేత్రస్థాయిలో సామాన్యుడికి అందేలా చూడాలని అధికారులను, భాగస్వాములను ఆయన కోరారు.
బీమా రంగంతో చేతులు కలిపిన ఆయుర్వేదం
ఈ సదస్సులో ఒక కీలక ఘట్టంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA), జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ మధ్య చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది. దీనివల్ల ఆయుష్ చికిత్సలు పొందే రోగులకు బీమా సౌకర్యం మరింత సులభతరం కానుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో పారదర్శకతను పెంచుతూ, ఆయుష్ చికిత్సల కోసం ప్రామాణిక బెంచ్మార్క్ రేట్ల పత్రాన్ని కూడా మంత్రి విడుదల చేశారు. దీనికి అదనంగా, ప్రజలకు సమాచారాన్ని వేగంగా చేరవేసేందుకు మంత్రిత్వ శాఖ అధికారిక వాట్సాప్ ఛానల్ను, బీమా సంబంధిత ఫిర్యాదులు, సందేహాల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ (1800-11-0008) ను ప్రారంభించడం విశేషం.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మాట్లాడుతూ, సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో అనుసంధానించడం ద్వారానే ఆయుష్ రంగానికి అంతర్జాతీయ ఆమోదం లభిస్తుందని నొక్కి చెప్పారు. సాక్ష్యాధారాలతో కూడిన పరిశోధనల అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. జాయింట్ సెక్రటరీ శ్రీమతి అలర్మెల్మంగై డి. మాట్లాడుతూ, ఆరోగ్య రంగంలో ఆయుష్ ఒక బలమైన స్తంభంగా ఎదుగుతోందని, ఇందులో యువ పరిశోధకుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
మేధోమథనం - ప్రధాన అంశాలు
తొలిరోజు జరిగిన మూడు సెషన్లలో కీలక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. తొలిసారిగా 023 లో జరిగిన చింతన్ శివిర్ నిర్ణయాల అమలుపై సమీక్షతో పాటు, ‘సంప్రదాయం నుండి అనువాదం’ అనే అంశంపై ప్రపంచ భాగస్వామ్యాల గురించి చర్చించారు. అలాగే, ఆయుష్ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో ఎదురయ్యే చట్టపరమైన సవాళ్లు, నియంత్రణ చట్రాలను బలోపేతం చేయడంపై న్యాయ నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ముగింపు కార్యక్రమంలో ఆయుర్వేద సలహాదారు డాక్టర్ కౌస్తుభ ఉపాధ్యాయ వందన సమర్పణ చేస్తూ, ఈ సదస్సు ద్వారా వచ్చే ఫలితాలు ఆయుష్ రంగాన్ని మరింత పటిష్టం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 17న ముగియనున్న ఈ సదస్సు, దేశ ఆరోగ్య చిత్రపటంలో ఆయుష్ స్థానాన్ని మరింత సుస్థిరం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.