ఢిల్లీలోని మధు విహార్లో నకిలీ ఈనో, నెస్కాఫే తయారీ కేంద్రాలపై క్రైమ్ బ్రాంచ్ దాడి. రూ. 20 లక్షల విలువైన నకిలీ ఉత్పత్తులు సీజ్, నలుగురు అరెస్ట్. పూర్తి వివరాల కోసం చదవండి.
న్యూఢిల్లీ, ఏప్రియల్ 21 : కాదేది కల్తికి అనర్హం అంటున్నారు కల్తీ రాయుళ్ళు. మొన్న వీట క్రీం , నిన్న ఇంజనాయాల్ ఇక తాజా ఈనో , కాఫీ పౌడర్ ఇలా దేశరాజధాని హస్తినలో రోజుకో ఉదంతం వెలుగుచూస్తూనే ఉంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఒక భారీ అంతర్రాష్ట్ర ముఠా ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ కు చిక్కింది. ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలో అత్యంత రహస్యంగా సాగుతున్న నకిలీ ఈనో పౌడర్ , నెస్కాఫే బ్రాండ్ కాఫీ పొడి తయారీ కేంద్రాలపై దాడి చేసిన పోలీసులు, సుమారు రూ. 20 లక్షల విలువైన నకిలీ సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, నకిలీల వెనుక ఉన్న భారీ నెట్వర్క్ను ఛేదించారు.
పక్కా సమాచారంతో మెరుపు దాడి క్రైమ్ బ్రాంచ్కు చెందిన సైబర్ సెల్, సదరన్ రేంజ్ బృందాలకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. ఇన్స్పెక్టర్ మంజీత్ కుమార్, ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ నేతృత్వంలో, ఏసీపీ స్వాగత్ పాటిల్ రాజ్కుమార్ పర్యవేక్షణలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మధు విహార్లోని రెండు డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఈ నకిలీ ఉత్పత్తుల తయారీ సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు దాడి చేసిన సమయంలో నిందితులు నిమగ్నమై నకిలీ ఈనో ప్యాకెట్లను, కాఫీ పొడిని ప్యాక్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అక్కడ లభించిన సామగ్రిని చూసి పోలీసులు సైతం అశ్చర్యపోయారు.
ఈ దాడుల్లో ప్రధానంగా:
ఈనో సంబంధిత వస్తువులు:68,256 సిద్ధంగా ఉన్న ఈనో సాచెట్లు, 1,000 ఖాళీ డబ్బాలు, 27,000 ప్యాకింగ్ కవర్లు, 14,896 సీల్ స్టిక్కర్లు, మరియు ఈనో తయారీకి వాడే ముడి పదార్థాలతో కూడిన రెండు భారీ డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు.
నెస్కాఫే కాఫీ వస్తువులు: 36,480 సిద్ధంగా ఉన్న నెస్కాఫే సాచెట్లు, 17 కిలోల బరువున్న 6 ప్యాకెట్ రోల్స్, 52 కిలోల ప్యాకింగ్ మెటీరియల్, మరియు ఎనిమిది గన్నీ బ్యాగుల్లో నింపిన 322 కిలోల నకిలీ కాఫీ పౌడర్ను పోలీసులు సీజ్ చేశారు.
యంత్రాలు: ప్యాకింగ్ కోసం ఉపయోగిస్తున్న మూడు సింగిల్ ట్రాక్ ఫిల్లింగ్ మెషీన్లు, కంప్రెసర్లు, రెండు హాట్ గన్లను స్వాధీనం చేసుకున్నారు.
నలుగురు నిందితుల అరెస్ట్.. నెట్వర్క్ గుట్టురట్టు
ఈ కేసులో పోలీసులు గీతా కాలనీ లో ఉండే నితిన్ భరద్వాజ్ (38), త్రి నగర్ ప్రాంతంలో ఉండే సంజయ్ బన్సాల్ (50), శాస్త్రి నగర్ కు చెందిన ఉత్తమ్ దాస్ (23), పపై దాస్ బరాగ్యా అలియాస్ పంకజ్ (19) అనే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో నితిన్ భరద్వాజ్ ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా వ్యవహరిస్తుండగా, సంజయ్ బన్సాల్ ఈ నకిలీ ఉత్పత్తుల పంపిణీ బాధ్యతలను చూసుకునేవాడు. ఉత్తమ్ దాస్ మరియు పంకజ్ ఆ తయారీ కేంద్రాల్లో కార్మికులుగా ఉంటూ ప్యాకింగ్ పనులను పర్యవేక్షించేవారు. నిందితుడు సంజయ్ బన్సాల్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా కాశ్మీరీ గేట్ వద్ద పోలీసులు వల పన్ని పట్టుకున్నారు.
కంపెనీల ధృవీకరణ పట్టుబడిన ఉత్పత్తులను పరిశీలించిన సదరు ఫార్మాస్యూటికల్, కాఫీ కంపెనీల ప్రతినిధులు, అవి తమ కంపెనీకి చెందినవి కావని స్పష్టం చేశారు. వాటి తయారీకి తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, నిందితులకు పంపిణీ చేసే హక్కులు లేవని వారు వెల్లడించారు. ఈ నకిలీ ఉత్పత్తులను అసలు వాటిలాగే భ్రమ కలిగించేలా ప్యాక్ చేసి సామాన్య వినియోగదారులను మోసం చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం
ఎసిడిటీ, గ్యాస్ సమస్యల కోసం ప్రజలు వాడే ‘ఈనో’ వంటి ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన రసాయనాలను కలిపి విక్రయించడం తీవ్రమైన నేరమని డీసీపీ రాహుల్ అల్వాల్ పేర్కొన్నారు. ఈ నకిలీ ఉత్పత్తులను కేవలం ఢిల్లీలోనే కాకుండా, ఇతర రాష్ట్రాలకు కూడా హోల్సేల్ మరియు రిటైల్ చానెల్స్ ద్వారా సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.
కేసు నమోదు - తదుపరి దర్యాప్తు ఈ వ్యవహారంపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR No. 86/26) నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ముడి పదార్థాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ పంపిణీ వ్యవస్థ ఎంతవరకు విస్తరించింది? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి లాభాలు గడించాలనుకునే ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.