పంజాబ్ కేబినెట్ మంత్రి, ఆప్ నేత సంజీవ్ అరోరా నివాసాలపై ఈడీ దాడులు జరిపింది. లూథియానా సహా 13 చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు.. భూ కుంభకోణం, స్టాక్ మార్కెట్ అవకతవకలపై ఆరా తీస్తున్నారు.
న్యూడిల్లి . ఏప్రియల్ 17 : పంజాబ్ రాజకీయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, రాష్ట్ర కేబినెట్ మంత్రి సంజీవ్ అరోరా లక్ష్యంగా శుక్రవారం ఉదయం నుంచి జరిగిన సోదాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. భూ కుంభకోణం నుంచి మొదలై, స్టాక్ మార్కెట్ అవకతవకలు, బెట్టింగ్ మాఫియాతో సంబంధాల వరకు ఈ దర్యాప్తు విస్తరించడం పంజాబ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
లూథియానాలోని మంత్రి సంజీవ్ అరోరా నివాసంతో పాటు జలంధర్, చండీగఢ్, గురుగ్రామ్ వంటి కీలక నగరాల్లోని మొత్తం 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ప్రారంభమయ్యాయి. సుమారు 15 బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. మంత్రి నివాసం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర పోలీసు బలగాలను భారీగా మోహరించారు. అధికారుల బృందం లోపలికి వెళ్లిన వెంటనే కమ్యూనికేషన్ వ్యవస్థలను నియంత్రణలోకి తీసుకుని, కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాల సేకరణలో నిమగ్నమైంది. కేవలం మంత్రి మాత్రమే కాకుండా, ఆయన వ్యాపార భాగస్వాములు, కుటుంబ సభ్యులు కూడా ఈ దర్యాప్తు రాడార్లోకి రావడం గమనార్హం.
రియల్ ఎస్టేట్ ముసుగులో భారీ అవకతవకలు?
ఈ దర్యాప్తుకు మూలం 'హాంప్టన్ స్కై రియల్టీ' అనే సంస్థకు సంబంధించిన భూ లావాదేవీలని తెలుస్తోంది. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములను నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతాలుగా మార్చి, ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొట్టారనేది ప్రధాన ఆరోపణ. అయితే, దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఈ వ్యవహారం రియల్ ఎస్టేట్ రంగానికి మాత్రమే పరిమితం కాలేదని స్పష్టమవుతోంది. షేర్ మార్కెట్లో కృత్రిమంగా ధరలను పెంచడం, నకిలీ అమ్మకాలను చూపడం వంటి తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. ముఖ్యంగా దుబాయ్ కేంద్రంగా సాగే బెట్టింగ్ నెట్వర్క్ ద్వారా వచ్చిన నల్లధనాన్ని భారత మార్కెట్లోకి మళ్లించారనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఈ మొత్తం ఉదంతంలో జలంధర్కు చెందిన ప్రముఖ క్రికెట్ బుకీ చంద్రశేఖర్ అగర్వాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హవాలా మార్గంలో వచ్చే అక్రమ సొమ్మును సంజీవ్ అరోరాకు చెందిన కంపెనీల్లో పెట్టుబడిగా పెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఈ అక్రమ వ్యాపారాలకు రక్షణ కల్పించడమే కాకుండా, దానికి ప్రతిఫలంగా భారీగా లాభాలు పొందుతున్నట్లు దర్యాప్తు సంస్థ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. సంజీవ్ కుమారుడు కావ్య అరోరా నివాసాల్లో కూడా సోదాలు జరగడం చూస్తుంటే, ఈ అక్రమ సామ్రాజ్యం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థమవుతోంది. నకిలీ జీఎస్టీ బిల్లుల ద్వారా కోట్ల రూపాయల నగదును చలామణిలోకి తెచ్చినట్లు కూడా ఆధారాలు లభిస్తున్నాయని సమాచారం.
ప్రజాస్వామ్యమా? నిరంకుశత్వమా? - కేజ్రీవాల్, మాన్ ఆగ్రహం
ఈ దాడులపై ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, ఇది కేవలం రాజకీయ వేధింపులని మండిపడ్డారు. ఇప్పటివరకు ఆప్ నేతలపై జరిగిన వందలాది దాడుల్లో ఒక్క రూపాయి అయినా నల్లధనం దొరికిందా అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. అధికారం కోసం బీజేపీ 'నీచ రాజకీయాలకు' పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. "మేము ఈ బెదిరింపులకు భయపడబోము" అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో నేరుగా గెలవలేక ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఇది 'డెమోక్రసీ' కాదు 'డిక్టేటర్షిప్' అని ఆయన వర్ణించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరచడమే కేంద్రం పనిగా పెట్టుకుందని, అభివృద్ధికి నిధులు ఆపడమే కాకుండా ఇలాంటి దాడులతో మానసికంగా కుంగదీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈడీ అధికారులు మంత్రి నివాసంలో సోదాలు కొనసాగిస్తున్నారు. సేకరించిన పత్రాలు, డిజిటల్ డేటా ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలుస్తోంది. పంజాబ్ కేబినెట్లో కీలక నేతగా ఉన్న అరోరా చుట్టూ ఉచ్చు బిగుస్తుండటం అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి రాజకీయంగా పెద్ద సవాలుగా మారింది.