హైదరాబాద్ , మే 15 : పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు అనూహ్య ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి పాలైంది. సంతోషంతో వెలిగిపోవాల్సిన ఆ ఇంట ఒక్కసారిగా ఆందోళన నీడలు అలుముకున్నాయి. కానీ, ఆ వరుడు మాత్రం వెనకడుగు వేయలేదు. కష్టకాలంలో తన జీవిత భాగస్వామికి కొండంత అండగా నిలబడి, ఆసుపత్రి ఐసీయూలోనే ఆమె నుదుట సింధూరం దిద్ది సరికొత్త ఆదర్శానికి వేదికయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని గొరఖ్‌పూర్‌లో మే 13 న జరిగిన ఈ అపూర్వ వివాహం ప్రస్తుతం అందరి హృదయాలను కదిలిస్తోంది.

పరీక్ష రాసి వస్తుండగా ఊహించని ప్రమాదం

బాన్స్‌గావ్ పరిధిలోని హత్వార్ గ్రామానికి చెందిన పూజా యాదవ్ అనే యువతి ఎల్‌ఎల్‌బీ చివరి సెమిస్టర్ చదువుతోంది. ఆమెకు మహువా గ్రామానికి చెందిన సన్నీ యాదవ్‌తో వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజైన మే 13వ తేదీ ఉదయం పూజా యాదవ్ తన సోదరుడితో కలిసి ఎల్‌ఎల్‌బీ పరీక్ష రాయడానికి సంత్ కబీర్ నగర్‌కు వెళ్ళింది. పరీక్ష ముగించుకుని మధ్యాహ్నం 12 గంటల సమయంలో బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, ఆమెకు అకస్మాత్తుగా కళ్ళు తిరిగాయి.

దీంతో బైక్ పైనుంచి కింద పడిపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. వెంటనే ఆమెను గొరఖ్‌పూర్‌లోని దావూద్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆమెను నగరంలోని ఆర్యన్ ఆసుపత్రి ఐసీయూ (ICU) విభాగానికి తరలించారు. పెళ్లి వేడుకలతో కోలాహలంగా ఉండాల్సిన వధువు ఇల్లు ఈ ప్రమాదంతో ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది.

ఆసుపత్రిలోనే పెళ్లికి ఇరు కుటుంబాల సాహసోపేత నిర్ణయం

వధువు ప్రమాదానికి గురైన వార్త తెలియగానే వరుడి పక్షం వారు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. పూజ ప్రాణాపాయం నుంచి బయటపడిందని, అయితే ప్రస్తుతానికి డిశ్చార్జ్ చేయడం కుదరదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పెళ్లిని వాయిదా వేయకూడదని ఇరు కుటుంబాల వారు ఒక సాహసోపేతమైన నిర్ణయానికి వచ్చారు. విధి ఆడిన వింత నాటకానికి ఎదురొడ్డి, ఆసుపత్రిలోనే వివాహ క్రతువు పూర్తి చేయాలని నిశ్చయించారు. వరుడు సన్నీ యాదవ్ పెళ్లి కుమారుడి వస్త్రధారణలోనే నేరుగా ఆసుపత్రికి చేరుకున్నాడు.

ఐసీయూ బెడ్‌పై సింధూరధారణ.. నిలిచిన ఆదర్శం

అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో, వైద్యుల సమక్షంలో ఐసీయూ బెడ్‌పై ఆసుపత్రి దుస్తుల్లోనే ఉన్న పూజ నుదుట సన్నీ యాదవ్ సింధూరం (పరాంగ్) దిద్దాడు. అక్కడకు చేరుకున్న పూజారి మంత్రోచ్ఛారణల మధ్య వివాహాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆసుపత్రిలో సింధూరధారణ కార్యక్రమం ముగిసిన తర్వాత, వరుడు సన్నీ తన బంధుమిత్రులతో కలిసి వధువు గ్రామమైన హత్వార్‌కు చేరుకుని ద్వారపూజతో పాటు మిగిలిన సాంప్రదాయ క్రతువులను పూర్తి చేశాడు. అనంతరం తన స్వగ్రామమైన మహువాకు వెళ్లి వివాహ వేడుకలను ముగించాడు.

వరుడు సన్నీ యాదవ్ బీఏ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. సంక్షోభ సమయంలో తన జీవిత భాగస్వామికి తోడుగా నిలిచి సన్నీ చూపిన చొరవ, ధైర్యం ఇప్పుడు గొరఖ్‌పూర్ అంతటా హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తోంది. కష్టాల్లో ఉన్న భాగస్వామిని వదిలిపెట్టకుండా అండగా నిలబడటమే నిజమైన ప్రేమంటూ స్థానికులు ఈ నూతన వధూవరుల గురుంచి చెప్పుకుంటున్నారు.